APTF VIZAG: టీచర్ల మెడపై కత్తి. ఉపాధ్యాయులు నిత్యం టెన్షన్‌ జీవితాన్ని గడుపుతున్నారు.

టీచర్ల మెడపై కత్తి. ఉపాధ్యాయులు నిత్యం టెన్షన్‌ జీవితాన్ని గడుపుతున్నారు.

సకాలంలో బడికి వెళ్లకుంటే ముఖ హాజరు పడుతుందో లేదో..? బడికి వెళ్లాక విద్యార్థులు యూనిఫాం వేసుకున్నారా? బూట్లు ఉన్నాయా లేదా.. బెల్టు పెట్టుకున్నారా.. లేదా పరిశీలించాలి. వర్క్‌బుక్స్‌ను చూడాలి.. మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్‌లోడు చేయాలి. మధ్యాహ్న భోజనం, గుడ్డు, చిక్కీ నాణ్యత పరిశీలించాలి.. ఇవన్నీ కూడా యాప్‌లలో అప్‌లోడ్‌ చేయాలి.. ఎఫ్‌ఏ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం చేయాలి. ఇంకోవైపు టెన్త్‌ పరీక్షలకు పిల్లలను సన్నద్ధం చేయాలి.. ఇన్ని పనుల్లో ఉపాధ్యాయులు నిత్యం టెన్షన్‌ జీవితాన్ని గడుపుతున్నారు.


వర్క్‌బుక్‌ పూర్తి కాకపోతే సస్పెన్షన్‌.. సిలబస్‌ పూర్తికాకపోతే మెమో.. ఆకస్మిక తనిఖీలకు వెళ్లటం ఇదే తరహాలో ఏదో ఒక కారణం చూపి చర్యలకు ఆదేశాలివ్వటం... డిసెంబరు వరకు ఒక మాట... ఫిబ్రవరి నుంచి మరోమాట... అధికారి మారితే ఆదేశాలూ మారిపోతాయట..! విద్యా సంవత్సరం మొత్తం చెయ్యాల్సిన పనిని కేవలం ఈ రెండు నెలల్లో పూర్తిచెయ్యాలని, చేయకుంటే చర్యలు తప్పవంటూ అటు ఉపాద్యాయుల మెడపై కత్తిపెడుతున్నారు. చిన్నారుల స్థాయికి మించిన వత్తిడి, శ్రమ ఒకేసారి పెట్టేస్తున్నారు. దీంతో గందరగోళ వాతావరణం నెలకొంది. అసలు విద్యాశాఖలో ఏం జరుగుతోందనే సందేహాలూ తలెత్తుతున్నాయి.


ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2,750 ప్రాథమిక పాఠశాలలు, 316 ప్రాథమికోన్నత పాఠశాలలు, 565 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో దాదాపు 6.25లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు 14వేలకుపైగా ఉపాధ్యాయులు వివిఽధ క్యాడర్లలో పనిచేస్తున్నారు. కరోనా తర్వాత విద్యావ్యవస్థలో ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చిన్నారులకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో గత సంవత్సరం డిసెంబరులో ఉపాద్యాయులకు టర్ల్‌ (టీచింగ్‌ ఎట్‌ రైట్‌ లెవల్‌) శిక్షణ తరగతులను ప్రభుత్వం నిర్వహించింది. ఆ సమయంలో ఉపాద్యాయులకు ఒక కిట్‌ను కూడా అందించారు. డిసెంబరు నుంచి ఏప్రిల్‌ వరకు ఆ కిట్‌ సాయంతో బోధన నిర్వహించాలని సూచించింది. ఆ తర్వాతే తర్వాతే వర్క్‌బుక్స్‌, పాఠ్యాంశాలపై దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు శిక్షణా సమయంలో వివరించారు. దీనినే ఉపాధ్యాయులు పాటిస్తూ వచ్చారు. అయితే జనవరి చివర్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్‌ ప్రకాష్‌ వచ్చాక వరుసగా పాఠశాలలపై తనిఖీలు నిర్వహిస్తూవచ్చారు. ప్రతి పాఠశాలలోనూ సిలబస్‌, వర్క్‌బుక్స్‌ తీరుపై ఆరాతీసి, ఎక్కడా అవి పూర్తికాకపోవటంతో అందరికీ మెమోలో, సస్సెన్షన్‌లకు ఆదేశాలిస్తూ వచ్చారు. ఈ పరిస్థితి ఏదో ఒక పాఠశాలలో ఉంటే ఆ పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవటం సబబే. అన్నిచోట్ల ఇదే పరిస్థితి ఎందుకుందనే విషయాన్ని గ్రహించకపోవటం మరో విశేషం.


ఇప్పటికిప్పుడు సాధ్యమేనా!


నిన్నటి వరకు ఒకవిధమైన ఆదేశాలిచ్చి, మళ్లీ ఇంతలోనే నిర్ణయం మార్చేసి ఇప్పటికిప్పుడు సిలబస్‌, వర్క్‌బుక్‌ పూర్తిచేయాలంటే సాధ్యమేనా! చిన్నారులు అంత వత్తిడిని ఒకేసారి తట్టుకోగలరా? ఇటువంటి అనాలోచిత నిర్ణయాలవల్ల కలిగే ప్రయోజనం ఏంటనేది విద్యాసంఘాల వాదన. తమపై కక్ష సాధించేందుకే ప్రభుత్వం ఈ తరహా చర్యలకు పాల్పడుతోందని ఉపాధ్యాయులు అంటున్నారు. 3 నుంచి 5వ తరగతి చదివే చిన్నారులకు వర్క్‌బుక్స్‌లో ఒక్కో పాఠ్యాంశానికి సంబంధించి ఏడు నుంచి పది పేజీల వరకు వర్క్‌ ఉంటోంది. వీటిని కేవలం ఒకటి, రెండు నెలల్లో చిన్నారులు పూర్తిచేయటం సాధ్యం కాదు. అటు టీచర్లకూ వాటిని పూర్తిచేయించటం కష్టమే. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే చిన్నారుల కుటుంబాలు చాలావరకు పేదరికంలో ఉన్నవే. ఆ కుటుంబంలో తల్లి, తండ్రి నిత్యం పనులకు వెళితే కానీ రోజు గడవని పరిస్థితి. ఇటువంటి కుటుంబాల్లో చిన్నారులకు ఇంటిదగ్గర తల్లిదండ్రులు దగ్గరుండి వర్క్‌బుక్స్‌ పూర్తిచేయించే అవకాశం ఉండదు. ఇటువంటి వారందరితో ఉపాద్యాయులే దగ్గరుండి పూర్తిచేయించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ టీచర్ల మెడపై ప్రభుత్వం కత్తిపెడితే, వారు చిన్నారులకు వత్తిడికి గురిచేయక తప్పదు. లేత వయస్సులో ఇంత వత్తిడిని వారు ఎట్లా తట్టుకుంటారనేది కూడా పెద్దలు ఆలోచించాల్సిన విషయం. అయితే టర్ల్‌ శిక్షణ సమయంలో అప్పటి ముఖ్యకార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులు సరైనవి కాకపోతే, ఇంత తక్కువ సమయంలో వాటిని ఎట్లా అధికమించాలనే దానిపై కసరత్తుచేసి, చిన్నారులపై వత్తిడి లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రస్తుతం అధికారులపైనే ఉంది.


నిత్యం ఏదో ఒక టెన్షన్‌.


ఒకప్పుడు ఉపాధ్యాయ వృత్తిని ఎంతో ఉల్లాసంగా నిర్వర్తించేవారు. అంకితభావంతో ఉపాధ్యాయులు బోధన పనిలో నిమగ్నం అయ్యేవారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. నిత్యం ఏదో ఒక టెన్షన్‌తోనే పాఠశాలల్లో పనిచేయాల్సిన దుస్థితి నెలకొంది. ఉదయం పాఠశాలకు వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వ అడిగే ప్రతి సమాచారం యాప్‌ల్లో పంపడం, విద్యార్థుల యూనిఫాం పరిశీలించడం, మధ్యాహ్న భోజనం, గుడ్డు, చిక్కీ నాణ్యత పరిశీలించడం.. సగంమంది ఉపాధ్యాయులు ఈ పనులే చేయాల్సి వస్తోంది. ఇందులో ఎవరైనా పనిచేయకుంటే ఆ భారం మొత్తం హెచ్‌ఎంల మీద పడుతోంది. ఆయా పనుల్లో ఎక్కడైనా తేడా వస్తే షోకాజ్‌ నోటీసులు.. సస్పెన్షన్ల భయంతో ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.


క్షేత్రస్థాయి సమస్యలు పట్టించుకోని అధికారులు


పాఠశాలల్లో క్షేత్రస్థాయిలో సమస్యలు అధికారులు పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. స్కూల్‌ యూనిఫాం కోసం ఇచ్చిన బూట్లు, సాక్సుల్లో, బ్యాగుల్లో నాణ్యత లేదు. ఈ విషయంలో విద్యార్థులు చేసే తప్పులకు ఉపాధ్యాయుల్ని బాధ్యులుగా చూపుతూ షోకాజ్‌ నోటీసులు, సస్పెషన్ల వంటివి చేస్తున్నారు. నాడు నేడు రెండో దశ పనులకు ఇంతవరకు నిధులు విడుదల కాలేదు. ఇసుక కోసం కొన్నాళ్లు హెచ్‌ఎంలు కాళ్లరిగేలా తిరిగారు. మరుగుదొడ్లు నిర్వహణ కోసం నిధులు లేవు. కనీసం పాఠశాలల్లో చాక్‌పీసులకు, మంచినీటి ఏర్పాటుకు, విద్యుత్‌ బిల్లులకు డబ్బులులేవు. ప్రభుత్వస్థాయిలో జరిగే లోపాలకు ఉపాధ్యాయుల్ని బాధ్యులుగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ జిల్లాకు వచ్చి వెళ్లిన తరువాత సమస్యలు, ఒత్తిళ్లు అధికమౌతున్నట్లు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అధికారులు ఉపాధ్యాయుల్ని వ్యక్తిగతంగా దూషించడం వంటి ఘటనలు ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.


నిత్యం కత్తిమీద సామే.


ఉపాధ్యాయ ఉద్యోగాలు నిత్యం కత్తిమీదసాములా మారుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో ఉపాధ్యాయుల అకస్మిక మరణాలు వారి కుటుంబాల్లో విషాదాలు నింపుతున్నాయి. గుంటూరు జిల్లాలో రెండు రోజుల వ్యవధిలో రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు ఉపాధ్యాయులు మరణించగా, మరో ఉపాధ్యాయుడు గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఇటీవల ఉమ్మడి జిల్లా పరిధిలో ఇద్దరు ఉపాధ్యాయులు గుండెపోటుతో ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. మరోవైపు అధికారులు సమీక్షల పేరుతో ఉపాధ్యాయుల్ని అసభ్య పదజాలంతో దూషిస్తున్న సంఘటనలు వారిలో మానసిక ఆందోళనల్ని మరింత పెంచుతున్నాయి. ప్రతి చిన్న మేసేజ్‌కు ఉలికిపాటుకు, ఒత్తిడికి గురికావాల్సి వస్తోందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒత్తిడి కారణంగా అనేకమంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు.


మనో నిబ్బరం కోల్పోరాదు.


ఉపాధ్యాయులు సమస్యలపై ఆందోళన చెంది ఒత్తిడికి గురికావద్దు.. వాటి పరిష్కార మార్గాలు అన్వేషించాలి.. ఇందుకు ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలు సహకరిస్తాయి. ఇటీవల కాలంలో పాఠశాలల్లో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరిగిందనేది వాస్తవం. దీనికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక నూతన విధానాలు కారణం. ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులు తమ సమస్యల్ని మా దృష్టికి లేదా, సంఘాల దృష్టికి తీసుకురావాలి. తీవ్ర మానసిక ఒత్తిడికి గురికావద్దు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే భావి విద్యార్థుల్ని తయారు చేసే ఉపాధ్యాయులు మనోనిబ్బరం కోల్పోరాదు.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4