APTF VIZAG: సీపీఎస్ పై 4 నుంచి ప్రక్రియ.ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వనిర్ణయం.మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష

సీపీఎస్ పై 4 నుంచి ప్రక్రియ.ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వనిర్ణయం.మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష

కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టం (సీపీఎస్)పై వచ్చేనెల 4వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీపీఎస్ ను రద్దుచేస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. గత కొద్ది రోజుల క్రితం ఉద్యోగ సంఘాల జేఏసీలు నిర్వహించిన ఆందోళనలో భాగంగా ఈ డిమాండ్ను ముందుకు తెచ్చాయి. రద్దుకు సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయని జూలై లోగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా సీపీఎస్ రద్దులో సాధ్యాసాధ్యాలను సీఎం జగన్ మంత్రులు, ఉన్నతా ధికారులతో చర్చించారు. సచివాలయం ఒకటో బ్లాక్ లోని ముఖ్యమంత్రి చాంబర్లో మంగళవారం జరిగిన ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేం ద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు. సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ మరియు ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. సీపీఎస్ రద్దు వల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది? ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు? ఇంకా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు సీపీఎస్ స్కీమ్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సంబంధిత ఉద్యోగుల సంఘాలను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంత్రుల బృందం, అధికారులు సంబంధిత ఉద్యోగుల సంఘాలకు కూడా ప్రజెంటేషన్ ఇవ్వాలని, ఆ తర్వాతే చర్చలు జరపాలన్నారు. ఈ మొత్తం ప్రక్రియ ఏప్రిల్ 4వ తేదీ నుండి ప్రారంభించాలని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. సీపీఎస్ స్కీం కింద గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కాక 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సుమారు రెండు లక్షల మందికి అమలవుతుందని అంచనా వేస్తున్నారు. సీపీఎస్ రద్దు వల్ల ప్రభుత్వంపై ఏటా రూ. లక్ష కోట్ల మేర భారం పడుతుందని చెప్తున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టినందున రద్దు నిర్ణయం అంత తేలిగ్గా జరిగేదికాదనే వాదనలు ఉన్నాయి.. వీటన్నింటిపై కూలంకషంగా ఉద్యోగ సంఘాలతో చర్చించాకే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. 

పాత పద్ధతినే కొనసాగించాలి... బొప్పరాజు

సీపీఎస్ రద్దుచేయటంతో పాటు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఏపీజేఏసీ- అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ దిశగా చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించగలరనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today