రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా పిఆర్సి ప్రకటించిన నేపథ్యంలో తమ సర్వీసు ప్రొబేషన్ను డిక్లేర్ చేసి జీతాలు నిర్ణయించకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయాల్లోని కార్యదర్శులు, ఇతర సిబ్బంది ఆగ్రహంగా ఉన్నారు. వెనువెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈరోజు నుండి అన్ని అధికార సోషల్మీడియా గ్రూపుల నుండి వైదొలగారు. బయోమెట్రిక్ అటెండెన్స్ను వేయకూడదని నిర్ణయించారు. ఈ మేరకు ఎంపిడీవోలకు సమాచారమిచ్చారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారని రేషన్ కార్డ్తోపాటు అనేక సంక్షేమ ఫలాలను వదులుకున్నామని సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వలే కొత్త జీతాలను తీసుకోలేకపోతున్నామని బాధపడుతున్నారు. వెంటనే తమ ప్రొబేషన్ను డిక్లేర్ చేసి కొత్త జీతాలు ఇవ్వకుంటే పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
కాగా, ఈ వివాదంపై గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పందించినట్లు సమాచారం. సచివాలయ ఉద్యోగులు వాట్సప్ గ్రూపుల నుండి బయటకు వెళుతున్నట్లు , విధులను బహిష్కరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. వారితో మాట్లాడి.. తిరిగి గ్రూపుల్లో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. సోమవారం ఒటిఎస్ మెగా మేళాను నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేశామని, ఇది వారికి తెలియజేసి, తిరిగి విధుల్లో చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించే ఉద్యోగుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. ఇటువంటి చర్యలను సహించే ప్రసక్తే లేదని, ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వంతో చర్చించాలని సూచించినట్లు తెలిసింది
No comments:
Post a Comment