APTF VIZAG: విద్యార్థుల ఫోటోతో హాజరు .పైలెట్‌ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా ఎంపిక. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ అమలు

విద్యార్థుల ఫోటోతో హాజరు .పైలెట్‌ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా ఎంపిక. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ అమలు

పాఠశాలల విద్యార్థుల హాజరును ఫొటోల ఆధారంగా నమోదు చేసేలా విద్యాశాఖ రూపొందించిన యాప్‌ను అమలు చేసేందుకు కృష్ణా జిల్లాను ఎంపిక చేశారు. కృష్ణాలో పైలెట్‌ ప్రాజెక్టుగా ఈ నూతన విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇక్కడ ఎదురైన సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్నే విద్యార్థుల హాజరు నమోదుకు వినియోగించనున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా అంతటా దీనిని అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.’

కృష్ణా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 4,532 ఉన్నాయి. వీటిలో 3,173 ప్రభుత్వ, 1359 ప్రైవేటు పాఠశాలలు. మొత్తంగా ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. 3.11లక్షల మంది ప్రభుత్వ బడుల్లో, 2.94లక్షల మంది ప్రైవేటు స్కూళ్లలో ఉన్నారు. ప్రస్తుతం వీరి హాజరును యాప్‌లో పొందుపరుస్తున్నారు. పాఠశాలకు రోజూ వచ్చే విద్యార్థుల హాజరును ప్రభుత్వ యాప్‌లో వారి పేరుతో నమోదు చేస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థి పేరు ఎదురుగా టిక్‌ మార్కు పెడుతున్నారు. దీని కోసం ప్రతి పాఠశాలలోనూ ప్రత్యేకంగా సిబ్బంది రెండు మూడు గంటలు కసరత్తు చేయాల్సి వస్తోంది. ఒక్కోసారి హాజరు నమోదు చేస్తున్న సమయంలో నెట్‌వర్క్‌ సమస్యలు రావడం, యాప్‌ ఓపెన్‌ కాకపోవడం లాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇది తమకు భారంగా మారుతోందంటూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫొటోతో హాజరు వేసే పంథాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

ఫొటోలతో హాజరు నమోదు చేసే ఈ విధానాన్ని ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఇబ్రహీంపట్నం మండలంలోని కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కొద్ది రోజులుగా అమలు చేస్తున్నారు.

ఒక్క చిత్రంతో మొత్తం హాజరు...

ఈ నూతన విధానంలో తరగతి గదిలో ఉన్న విద్యార్థులందరూ కనిపించేలా ఒకే ఫొటో తీయాలి. దానిని హాజరు యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఆ ఫొటో ఆధారంగా ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారనేది లెక్కించుకునేలా సాంకేతికతను జోడించారు. ఫొటోలో ఎంత మంది ఉంటే అంత ఆ తరగతి హాజరుగా నమోదవుతుంది. దీనివల్ల ప్రత్యేకంగా ఒక్కొక్క విద్యార్థి పేరు ఎదురుగా యాప్‌లో టిక్‌ చేయాల్సిన అవసరం ఉండదని విద్యాశాఖ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికే హాజరు నమోదుకు వినియోగిస్తున్న యాప్‌ను మొబైల్‌ ఫోన్‌ నుంచి తొలగించి కొత్తగా మరోసారి ఇన్‌స్టాల్‌ చేసుకోమంటూ ఓ లింక్‌ను కూడా పంపించారు.

త్వరలోనే జిల్లా వ్యాప్తంగా అమలు : - తాహెరా సుల్తానా, డీఈవో

విద్యార్థుల హాజరు నమోదుకు రూపొందించిన యాప్‌ను కృష్ణా జిల్లా వ్యాప్తంగా త్వరలో అమలు చేయనున్నాం. అన్ని పాఠశాలల్లో అమలు చేసే విధంగా జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులు, మండల అధికారులు పర్యవేక్షించనున్నారు. దీనిపై ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరికీ అవగాహన కల్పిస్తాం.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4