APTF VIZAG: పీఆర్సీ పై సంయమనం పాటించండి.ఉద్యోగ సంఘాలకు మంత్రి బొత్స విజ్ఞప్తి

పీఆర్సీ పై సంయమనం పాటించండి.ఉద్యోగ సంఘాలకు మంత్రి బొత్స విజ్ఞప్తి

పిఆర్సి విషయంలో ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. పిఆర్సికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే ఐఆర్ కూడా ప్రకటించామని తెలిపారు. సోమవారం ఆయన విజయగనరంలో విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల రాయలసీమలో వచ్చిన వరదలను తమ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొందని, ముందస్తు అప్రమత్తతతో ఆస్తి, ప్రాణనష్టాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల ఖాతాల నుంచి ప్రభుత్వం వెనక్కు తీసుకుందన్న ప్రతిపక్షాలు ఆరోపణను ఆయన తోసిపుచ్చారు. కేవలం విద్యుత్ ఛార్జీలను చెల్లించేందుకు మాత్రమే ఆ నిధులను తీసుకున్నామన్నారు. మున్సిపల్ కాంట్రాక్టర్ల పాత పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని, ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా 1121 రకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. విజయనగరం జిల్లాలో చెరకు రైతులు నష్టపోకుండా శ్రీకాకుళంలోని సంకలి చక్కెర కర్మాగారం యాజమాన్యంతో చర్చించామన్నారు. చెరకు టన్నుకు రూ.2,630 చెల్లించేందుకు, రవాణా, లోడింగ్ ఛార్జీలను కూడా యాజమాన్యమే భరించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. బొబ్బిలిలోని ఎస్సీఎస్ ప్రైవేటు సుగర్ ఫ్యాక్టరీకి చెందిన పంచదారను, భూములను వేలం వేసి రైతులకు బకాయి పడ్డ సుమారు రూ.16 కోట్లను చెల్లించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. భీమసింగి చెరకు ఫ్యాక్టరీ తెరవడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరమూ లేదని తెలిపారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today