APTF VIZAG: JEE Advanced 2021 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.:

JEE Advanced 2021 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.:

 దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు జరగ్గా.. ఆ ఫలితాలను ఖరగ్‌పూర్‌ ఐఐటీ శుక్రవారం ఉదయం విడుదల చేసింది. విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీలు సహా 114 విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తం 50వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను 20వేల మంది విద్యార్థులు రాశారు. రేపట్నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 25వరకు రిజిస్ట్రేషన్లు, 27న సీట్లు కేటాయింపు జరపనున్నారు. ఫలితాల కోసం https://jeeadv.ac.in/ 

వెబ్‌సైట్‌లో చూడవచ్చు.మెరిసిన తెలుగు విద్యార్థులు..

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు 1,51,193మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 1,41,699మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 41,862మంది అర్హత పొందారు. అర్హత సాధించిన వారిలో 35,410 మంది బాలురు కాగా.. 6452మంది బాలికలు ఉన్నారు. ఈ ర్యాంకుల ఆధారంగా ఐఐటీలు సహా 114 విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఖరగ్‌పూర్‌ ఐఐటీ విడుదల చేసిన ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు మెరిశారు. దేశవ్యాప్తంగా చూస్తే.. జనరల్‌ కేటగిరీలో మృదుల్ అగర్వాల్‌కు మొదటి ర్యాంకు రాగా.. బాలికల విభాగంలో కావ్య చోప్రాకు ప్రథమ ర్యాంకు లభించింది. అలాగే, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో రామస్వామి సంతోష్‌రెడ్డికి తొలి ర్యాంకు, ఎస్సీ కేటగిరిలో నందిగామ నిఖిల్‌కు మొదటి ర్యాంకు లభించాయి. ఈ ఫలితాల్లో గుంటూరు జిల్లాకు చెందిన రుషికేశ్‌రెడ్డికి పదో ర్యాంకు రాగా.. విజయవాడకు చెందిన దివాకర్‌ సాయికి 11వ ర్యాంకు వచ్చింది.

100 లోపు అడ్వాన్స్‌డ్‌ ర్యాంకర్లకు ఖర్చులు మావే.. ఖరగ్‌పూర్‌ ఐఐటీ ప్రకటన. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 100 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు చేరిన ఐఐటీలను నిపుణులు ఉత్తమమైనవిగా భావిస్తుంటారు. ఆ ర్యాంకర్లు ఏయే ఐఐటీల్లో చేరారు, ఎంత మంది చేరారు.. అని ప్రతి ఏటా చర్చ సాగుతుంది. దీనిపై ఐఐటీ ఖరగ్‌పుర్‌ ఈసారి దృష్టి సారించి నజరానాలు ప్రకటించింది. పండిత్‌ ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌ పేరిట విద్యార్థులకు పూర్తి స్కాలర్‌షిప్‌ చెల్లింపు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించిన ఈ సంస్థ.. విద్యార్థులకు సంబంధించిన ఇతర ఖర్చులనూ భరించనుంది. తమ సంస్థల్లో ప్రవేశాలు పొందిన 100 లోపు ర్యాంకర్లు ఈ విద్యాసంవత్సరం(2021-22) నుంచి ట్యూషన్‌ ఫీజులతోపాటు హాస్టల్‌ రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని నిర్ణయించింది. పైగా.. పుస్తకాలు, ల్యాప్‌టాప్‌ కొనుగోలు ఖర్చులు, ప్రతి నెలా వ్యక్తిగత ఖర్చుల కోసం డబ్బులు ఇస్తామని కూడా సంస్థ సంచాలకుడు ఆచార్య వీరేంద్ర కుమార్‌ తివారీ ఇటీవల ప్రకటించారు. గతేడాది వంద లోపు ర్యాంకర్లు ఐఐటీ బాంబేలో 58 మంది, దిల్లీలో 29 మంది, మద్రాస్‌లో ఆరుగురు చేరారు. దేశంలోనే మొదటగా ప్రారంభమైన ఐఐటీ ఖరగ్‌పుర్‌లో మాత్రం గత కొన్నేళ్లుగా వంద లోపు ర్యాంకర్లు ఒక్కరూ చేరడం లేదు. దీంతో ఉత్తమ ర్యాంకర్లు తమ సంస్థల్లో ప్రవేశం పొందాలన్న ఉద్దేశంతోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే.. ఆ విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.20 లక్షల లోపు ఉండాలని నిబంధన విధించింది.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4