స్కూల్ బ్యాగుల బరువు విషయంలో పిల్లలకు ఉపశమనం కలగనుంది. ప్రతిరోజూ పుస్తకాలన్నీ మోసుకెళ్లే పద్ధతికి పాఠశాల విద్యాశాఖ స్వస్తి పలికింది. ఏరోజుకారోజు అవసరమైన పుస్తకాలను మాత్రమే విద్యార్థులు తెచ్చుకునే విధానం తెచ్చింది. ఈ మేరకు ‘స్కూల్ బ్యాగ్ పాలసీ-2020’ అమలుకు పాఠశాల విద్య కమిషనర్ సురేష్కుమార్ ఆదేశాలు జారీచేశారు. జాతీయ విద్యా విధానం, మానవ వనరుల మంత్రిత్వ శాఖ సూచనలకు అనుగుణంగా పిల్లల బ్యాగ్ ఎంత బరువు ఉండాలనే దానిపై నిబంధనలు రూపొందించింది. తాజా నిబంధనల ప్రకారం ప్రతి స్కూలూ.. టైంటేబుల్ తయారుచేసుకుని, వీలైనంత మేర బ్యాగ్ల బరువును తగ్గించే ప్రయత్నం చేయాలి. పిల్లలకు ఎక్కువ గంటల చదువు కంటే సులభంగా నేర్చుకునేలా ‘ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్’ అమలుచేయాలి.
Click Here To Download proceedings
పుస్తకాలతో అవసరం లేకుండా అందుబాటులో ఉండే మెటీరియల్తో ప్రాజెక్టు వర్కులు చేయించాలి. 1, 2 తరగతుల విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వకూడదు. 3 నుంచి 5 తరగతుల పిల్లలకు నేరుగా వర్క్బుక్లోనే హోంవర్క్ రాసి పాఠశాలల్లోనే టీచర్లకు ఇవ్వాలి. 6 నుంచి 10 తరగతులకు కూడా ఈ విధానమే ఉండాలి. విద్యార్థులకు రోజువారీ నిర్దేశించిన సబ్జెక్టులకే హోంవర్క్ ఇవ్వాలి. ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు రోజూ ఒక గణితం పుస్తకం, ఇతర సబ్జెక్టుల్లో ఒక పుస్తకం తెచ్చుకునే విధానం అమలుచేయాలి. టీచర్లు ఏ సబ్జెక్టు బోధిస్తారో ముందుగానే నిర్ణయించి, ఆ రోజుకు ఆ పుస్తకాలను మాత్రమే తెచ్చే విధానం పిల్లలకు అలవాటుగా మారేలా చేయాలి. విద్యార్థులు సెమిస్టర్ల వారీగానే పుస్తకాలు తెచ్చుకోవాలి. వీలైన చోట్ల పాఠశాలల్లోనే విద్యార్థుల పుస్తకాలు ఉంచుకునేలా బాక్సులు, షెల్ఫ్లను ఏర్పాటు చేయలి. వీలైతే వర్క్బుక్లు, అసైన్మెంట్లు, డిక్షనరీలు, రిఫరెన్స్ పుస్తకాలు, ప్రాక్టీస్ మెటీరియల్ లాంటివి పాఠశాలల్లోనే ఉండే ఏర్పాట్లుచేయాలి.
No comments:
Post a Comment