APTF VIZAG: పీఆర్సీ నివేదిక బయటపెట్టరేం?జీతం రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం.అశుతోశ్‌ నివేదికను కోర్టు ముందుంచండి పీఆర్సీ జీవోలు పిటిషనర్‌కు ఇవ్వండి: హైకోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

పీఆర్సీ నివేదిక బయటపెట్టరేం?జీతం రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం.అశుతోశ్‌ నివేదికను కోర్టు ముందుంచండి పీఆర్సీ జీవోలు పిటిషనర్‌కు ఇవ్వండి: హైకోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

పీఆర్సీ విషయంలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అశుతోశ్‌ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. నివేదికను ఉద్యోగులకు ఇవ్వకుండా గోప్యత ఎందుకు పాటిస్తున్నారని ప్రశ్నించింది. న్యాయస్థానానికి మాత్రమే నివేదికను అందజేస్తామని చెప్పేందుకు ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక అధికారం ఏమిటని ప్రశ్నించింది. పీఆర్సీ అమల్లో భాగంగా ఏ ఉద్యోగి నుంచైనా జీతం రికవరీ చేసినట్లు తేలితే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను పిటిషనర్‌కు అందజేయాలని స్పష్టం చేసింది. కౌంటర్‌ దాఖలు చేయడంతో పాటు అశుతోశ్‌ మిశ్రా ఇచ్చిన నివేదికను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. పీఆర్సీ విషయంలో జనవరి 17న ప్రభుత్వం జారీ చేసిన జీవో 1ని సవాల్‌ చేస్తూ ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ జేఏసీ ఛైర్మన్‌ కె.వి.కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దానిపై విచారణ జరిపిన ధర్మాసనం వేతన సవరణ ఉత్తర్వులు ఆధారంగా ఏ ఉద్యోగి జీతంలో రికవరీ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది పి.రవితేజ వాదనలు వినిపిస్తూ... ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్‌ దాఖలు చేయలేదన్నారు. అశుతోశ్‌ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదికను, జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదన్నారు. దీనిపై ధర్మాసనం అడ్వకేట్‌ జనరల్‌ వివరణ కోరింది. ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ... ఉద్యోగుల జీతం నుంచి రికవరీ చేయడం లేదన్నారు. పీఆర్సీ నివేదికను కోర్టు ముందు ఉంచుతామని, దానిని పరిశీలించిన తరువాత పిటిషనర్‌కు ఇచ్చే విషయంలో ధర్మాసనం నిర్ణయం తీసుకోవచ్చన్నారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today