APTF VIZAG: ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అంగన్‌వాడీలు సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశం

ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అంగన్‌వాడీలు సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశం


ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం జగన్‌ చెప్పారు. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలను ఇక నుంచి ప్రీప్రైమరీ స్కూళ్లుగా మార్చుతామన్నారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌లో ప్రీప్రైమరీ-1,2లపై విద్యాశాఖ, మహిళా, శిశుసంక్షేమశాఖ అధికారులతో జగన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం   మాట్లాడుతూ ‘అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌కు రూ.4వేల కోట్లు ఖర్చు చేయనున్నాం. ఈ నిధుల సమీకరణపై ఆర్థికశాఖ అధికారులు ప్రణాళికలు వేయాలి. నాడు-నేడు కార్యక్రమం కింద అంగన్‌వాడీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీప్రైమరీకి కొత్త పాఠ్యప్రణాళికలు అమలు చేయాలి. ఒకటో తరగతి పాఠ్యప్రణాళికతో ట్రాన్సిషన్‌ ఉండాలి. ఈ ప్రత్యేక పాఠ్య ప్రణాళిక తయారీ బాధ్యత విద్యాశాఖ చేపట్టాలి. కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. అంగన్‌వాడీ వర్కర్లకు ఇప్పుడున్న కనీస విద్యార్హత పదో తరగతి కాగా, వారికి ఏడాదిపాటు డిప్లొమా కోర్సు నిర్వహించాలి. బోధనా పద్ధతులు, పాఠ్యప్రణాళికపై వారికి శిక్షణ ఇవ్వాలి. ఇంటర్‌, డిగ్రీ చేసిన వారికైతే ఆరు నెలలు కోర్సు పెట్టాలి. పిల్లలకు సులభమైన మార్గాల్లో విద్యాబోధన చేయాలి. అంగన్‌వాడీల్లో తాగునీరు, బాత్‌రూములు ఏర్పాటు చేయాలి. పాఠశాలల్లోని సదుపాయాలన్నీ ప్రీస్కూళ్లలోనూ ఉండాలి’ అని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమ్మఒడి పథకం ద్వారా విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చామని, ఇప్పుడు ప్రీప్రైమరీ విద్యలో కూడా అదే బాటలో నడుస్తున్నామన్నారు. పిల్లల ఆరోగ్యం, చదువులు, పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక నుంచి అంగన్‌వాడీ కేంద్రాలను వైఎ్‌సఆర్‌ ప్రీప్రైమరీ స్కూళ్లుగా పిలవాలని, ప్రీస్కూళ్లకు అవసరమైన భవనాలు నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రీప్రైమరీ స్కూళ్ల కోసం కొత్తగా రూపొందించిన పుస్తకాలను మహిళాశిశుసంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత సీఎంకు చూపించారు. సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ కూడా పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4